Radar | లో ఫ్రీక్వెన్సీ రాడార్ను వికారాబాద్ అడవుల్లోనే ఎందుకు పెట్టాలి? ఇదేమన్న వ్యూహాత్మక ప్రాంతమా? భారత దేశంలో దీనికి అనువైన ప్రాంతాలేమీ లేవా? జనావాసాలు లేని ద్వీపాలు దేశంలో అనేకం ఉన్నాయి. అక్కడ పెట్టుకోవచ్చు కదా?. హైదరాబాద్ సమీప అడవుల్లో.. అందునా మూసీ నది దగ్గరే ఎందుకు పెట్టాలి? ప్రకృతిని ధ్వంసం చేయడం మంచిది కాదు. ఇది పబ్లిక్ ఇష్యూ. మూసీని కూడా కాపాడుకోకుంటే ఇక ప్రభుత్వం ఉన్నది దేని కోసం?
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వికారాబాద్ అడవుల్లోని దామగుండం వద్ద లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మూసీ నది అంతర్థానమయ్యే ప్రమాదం ఉన్నదని, రాడార్ కేంద్ర ఏర్పాటు మూసీకి మరణశాసనం అవుతందని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కీలక నది అయిన మూసీ జన్మస్థానంలో సుమారు 12 లక్షల వృక్షాలను నరికివేయడం వల్ల అక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. జీవజాలం కకావికలమవుతుందని తెలిపారు. లోఫ్రీక్వెన్సీ రాడార్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై కూడా అనేక అనుమానాలున్నాయని, అమెరికా వంటి దేశాలు ఈ తరహా టెక్నాలజీ వాడకాన్ని నిలిపివేశాయని చెప్పారు. రాడార్ కేంద్రం ఏర్పాటుపై పురుషోత్తంరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో పలు విషయాలు పంచుకొన్నారు.
మూసీకి నీళ్లెట్లా వస్తాయి?
మూసీ నది జన్మస్థానం వికారాబాద్ అడవులు. సోర్స్ ఆఫ్ ద రివర్ ఇక్కడి అడవులే. ఈ అడవులను మౌత్ ఆఫ్ ద రివర్గా కూడా చెప్పవచ్చు. నది సోర్స్ను దెబ్బతీయొద్దు. అది దెబ్బతింటే నది పూర్తిగా ఎండిపోతుంది. ప్రకృతిసిద్ధంగా ఈ అడవుల్లో నీటి ఊటలు (స్పింగ్స్) ఉంటాయి. వీటి నుంచే నీళ్లు అడవుల్లో పారుతుంటాయి. ఇక్కడి దామగుండం పరిసరాల్లో కూడా కోనేరు ఉన్నది. అక్కడ సీజన్తో సంబంధం లేకుండా నీళ్లు ఉంటాయి. అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామి కోనేరు వద్ద కూడా ప్రకృతిసిద్ధంగా ఉండే ఊటలు కనిపిస్తాయి. వీటి నుంచే మూసీకి నీళ్లు వస్తాయి. మూసీ జన్మస్థానంలోని అడవులను నరికివేస్తే మరి మూసీ ఎట్లా పారుతుంది? గండిపేట వంటి జలాశయాలకు నీళ్లు ఎట్లా వస్తాయి? అడవులను నరకడం వల్ల కలిగే అనర్థాలు వెంటనే తెలియకపోవచ్చు. భవిష్యత్తుకు ఇబ్బంది. ఒక పరిశ్రమను ఏర్పాటు చేసే సమయంలో వీటన్నింటినీ అంచనా వేయాలి. ‘ది సోర్స్ ఆఫ్ రివర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎకో సెన్సిటివ్ జోన్’ అని పార్లమెంటు కూడా సూత్రీకరించింది. ఏ నదికైనా ముఖ్యమైనది అది పుట్టిన ప్రదేశమే. దానిని ఎకో సెన్సిటివ్ ఏరియా అంటారు. గంగానది జన్మస్థానం వద్ద 150 చదరపు కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. గంగోత్రి, యుమునోత్రి ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్నపుడు మన మూసీనది పుట్టిన ప్రాంతం ఎందుకు ఎకో సెన్సిటివ్ జోన్ కాదు? ఎకో సెన్సిటివ్ జోన్లో కేంద్రమే రాడార్ కేంద్రాన్ని ఎలా పెడుతుంది? దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి.
ప్రజల మద్ద్దతుంటేనే సాధ్యం
దామగుండంలో జరుగుతున్నదానిపై మేం కొంతమందిమి స్థానికులను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను అనేకసార్లు స్వయంగా వెళ్లి వచ్చాను. సదస్సులు, సమావేశాలు పెట్టినం. కానీ, అక్కడున్న రాజకీయ కారణాలో, మరేమిటోకానీ ప్రజల నుంచి మేం ఆశించినంత స్పందన రాలేదు. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ సిస్టంవల్ల కలిగే అనర్థాల గురించి ఎంత చెప్పినా వాళ్లకు అర్థం అవ్వడంలేదు. అయితే, కొంత చైతన్యం మాత్రం తీసుకురాగలిగాం. ప్రజల మద్దతు ఉంటేనే ఏదైనా సమస్యపై పోరాటం చేయగలం. నల్లగొండలో యురేనియం కోసం తవ్వకాలు చేస్తామంటే మేం ఉద్యమించి ఆపించినం. అక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దామగుండం, పరిగి ప్రాంతాల్లో అనుకున్నమేర స్పందన కనిపించలేదు.
2 వేల ఎకరాలకు గోడ కడితే స్థానికుల ప్రవేశం ఎలా?
దామగుండంలో రెండువేల ఎకరాలకుపైగా అటవీ భూములను నేవీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడేమో ఉద్యోగాలకు, లోపల ఉన్న గుడికి ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా వెళ్లి రావచ్చని చెప్తున్నారు. కానీ, 2 వేల ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ కడితే స్థానికులు ఎలా వెళ్లి రాగలరు? నిజంగానే రానిస్తారా? ఇప్పుడున్న అడవి అక్కడి స్థానికంగా ఉన్న పదుల గ్రామాల ప్రజలకు అనేకరకాలుగా ఉపయోగపడుతున్నది. పశుగ్రాసాన్ని అక్కడి నుంచి తెచ్చుకుంటారు. పండ్లు, మొక్కలు, వంట చెరుకు.. ఇలా అనేకం తెచ్చుకుంటారు. అక్కడ వాళ్లు తరతరాలుగా పూజిస్తున్న దేవతల గుళ్లున్నాయి. పూజలు చేసుకుంటారు. జాతరలు చేసుకుంటారు. మరి నేవీవాళ్లకు ఆ అడవిని అప్పగిస్తే ఇది సాధ్యమవుతుందా?
ప్రజలను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత కాదా?
ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం దామగుండం రాడార్ కేంద్రంపై దృష్టిసారించాలి. ఇది పబ్లిక్ ఇష్యూ. ప్రజల కోణంలో వాళ్లు ఆలోచించాలి. మూసీని కాపాడుకోకుంటే ప్రభుత్వం ఉన్నది దేని కోసం? ప్రజలను కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.
రాడార్లను ఇక్కడే ఎందుకు పెట్టాలి?
లో ఫ్రీక్వెన్సీ రాడార్ను వికారాబాద్ అడవుల్లోనే ఎందుకు పెట్టాలి? ఇదేమన్న వ్యూహాత్మక ప్రాంతమా? భారత దేశంలో దీనికి అనువైన ప్రాంతాలేమీ లేవా? జనావాసాలు లేని ద్వీపాలు దేశంలో అనేకం ఉన్నాయి కదా? అక్కడ పెట్టుకోవచ్చు. నది దగ్గరే ఎందుకు పెట్టాలి? ప్రకృతిని ధ్వంసం చేయవద్దు. ఇది మంచిది కాదు.
పాత టెక్నాలజీ కోసం అడవులను నరుకుతారా?
ఎక్స్ట్రీం లో ఫ్రీక్వెన్సీ రాడార్ అన్నది కాలం చెల్లిన టెక్నాలజీ. సాధారణంగా ఇలాంటి వాటిని గట్టిరాయి ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఈ సాంకేతికత చాలా పురాతనమైనది. మొత్తం ప్రపంచం ఈ విధానాన్ని తిరస్కరించింది. అమెరికాలో అయిదుచోట్ల ఈ తరహా రాడార్లను తీసివేశారు. మసాచుసెట్స్, కాలిఫోర్నియా, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో ప్రజల నిరసనలతో వీటిని తీసేశారు. ఇప్పుడు శాటిలైట్లతోనే అవసరమైన సమాచారాన్ని తీసుకుంటున్నారు. మనం కూడా ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ వాడేవాళ్లం. ఇప్పుడు మొబైల్ ఫోన్లను వాడుతున్నాం. అలాగే ఇక్కడ వీఎల్ఎఫ్, ఈఎల్ఎఫ్ టెక్నాలజీలు కూడా. వేల కిలోమీటర్ల దూరంలో, సముద్రగర్భంలో ఉండే సబ్మెరైన్ల కోసం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయడం బాగానే ఉన్నది కానీ, వాడుతున్న టెక్నాలజీనే కాలం చెల్లింది. అత్యాధునిక టెక్నాలజీని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటే మానవజాతికి జరిగే నష్టం తగ్గుతుంది’ అని వివరించారు.
యూపీఏ హయాంలో పర్యావరణ చట్టాలు నిర్వీర్యం
సాధారణంగా ఏదైనా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నపుడు అటవీ భూములను తీసుకునే సందర్భంలో చట్ట ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) చేయాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఇవి ఒరిజినల్ చట్టాలు. మన్మోహన్సింగ్ ప్రధానిగా పర్యావరణ చట్టాలను చాలావరకు నిర్వీర్యం చేశారు. మనదేశంలో దురదృష్టం ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకరకమైన అభివృద్ధిని మాత్రమే కోరుకుంటాయి. ఎంతసేపు పెద్ద ఇండస్ట్రీస్ వాళ్లు చెప్పేదే అభివృద్ధి అనుకుంటారు. భారీ పెట్టుబడులు పెట్టే వారి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. భవిష్యత్తుతరాల గురించి, పర్యావరణం గురించి ఆలోచించరు. ఇలాంటి చర్యల వల్ల పెద్దపెద్ద సంక్షోభాలు వస్తాయి. పర్యావరణంపై అవగాహన ఉన్నవాళ్లు ఎవరైనా న్యాయస్థానాల్లో కొట్లాడి ఏదైనా ఆర్డర్ తెస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేయవు. అలాంటప్పుడు కొట్లాడేవాళ్లకు పనిచేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది.