న్యూఢిల్లీ, మే 29: జూలై-ఆగస్టు నెలల్లో దేశం మరోసారి విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోనున్నదని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక హెచ్చరించింది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయని, నైరుతి వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగి విద్యుత్తు సంక్షోభం ఏర్పడుతుందని వివరించింది. అన్ని థర్మల్ కేంద్రాల్లో కలిపి 20.7 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.
‘దేశంలో ఏమాత్రం విద్యుత్తు వినియోగం పెరిగినా థర్మల్ కేంద్రాలు భరించే స్థితిలో లేవు’ అని సీఆర్ఈఏ తన నివేదికలో పేర్కొన్నది. దేశంలో బొగ్గు ఉత్పత్తికి లోటు లేదని సీఆర్ఈఏ తన నివేదికలో తెలిపింది. అయితే, థర్మల్ ప్లాంట్లకు బొగ్గును చేరవేయడంపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇటీవల విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 214 గిగావాట్లకు చేరవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(సీఈఏ) అంచనా వేస్తున్నది. దేశంలో 2021-22లో 777.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది.