పెద్దపల్లి : ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రామగిరి మండల పరిధిలోని కే కే నగర్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కేకే నగర్కు చెందిన గొడుగు అంజలి(18), రాజు(22) అనే యువకుడు గత మూడేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే అంజలి డిగ్రీ చదువుతుండగా, రాజు 8-ఇంక్లైన్ కాలనీలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని రాజు.. అంజలిపై గత కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామని అంజలి రాజుకు సర్దిచెప్పింది.
ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని రాజు ఒత్తిడి తేవడంతో.. ఇటీవల వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం అంజలి ఇంటికి చేరుకున్న రాజు.. ఆమె గొంతును కత్తితో కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడ్నుంచి రాజు పరారీ అయ్యాడు. అంజలి, రాజు ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలు స్పందించలేదు. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.