హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుతో విద్యుత్తు సంస్థలకు ఇబ్బందులు తప్పవని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంట్ కమిటీ ముందున్న ఈ బిల్లుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే కేంద్రం ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ ఎర్రగడ్డలోని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కృష్ణకాంత్పార్క్ వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎండీ ప్రభాకర్రావు మీడియాతో మాట్లాడారు.
గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలో గణనీయంగా జల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నదని, నిరుడు రికార్డు స్థాయిలో 5 వేల మిలియన్ యూనిట్లకుపైగా ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగుల కోసం ఇప్పటికే వేతన సవరణ కమిటీ (పీఆర్సీ)ని వేశామని, త్వరలోనే తీపికబురు వస్తుందని అన్నారు. అనంతరం విద్యుత్తు సంస్థల అంతర్గత సామర్థ్యంపై జరిగిన సమీక్షలో సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. వినియోగదారులకు గత ఎనిమిదేండ్ల నుంచి రోజూ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నామన్నారు. విద్యుత్తు సంస్థల అంతర్గత సామర్థ్యంతోపాటు మీటర్ సేల్స్ను పెంచుకొంటూ సాంకేతిక, వాణిజ్య నష్టాలను అధిగమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఎనర్జీ ఆడిటింగ్, అకౌంట్స్ను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.
వర్షాల వల్ల భారీ నష్టం
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల విద్యుత్తు సంస్థలకు భారీ నష్టం వాటిల్లినట్టు సీఎండీ ప్రభాకర్రావు వెల్లడించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు రూ.70 కోట్లు, ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.10 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని అభినందించారు. రానున్న రోజుల్లో విద్యుత్తు సంస్థలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు, ట్రాన్స్కో జేఎండీ సీ శ్రీనివాస్రావుతోపాటు ట్రాన్స్కో, జెన్కో, రెండు డిస్కంల పరిధిలోని డీఈలు, ఆ పైస్థాయి అధికారులంతా పాల్గొన్నారు.