చిన్నచింతకుంట, ఫిబ్రవరి 28: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతలలో సోమవారం కాకతీయుల కాలం నాటి చెన్నకేశవస్వామి విగ్రహం బయటపడింది. గ్రామానికి పశ్చిమ దిశలో ఉన్న ఊక చెట్టు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇసుకను తొలగిస్తుండగా నల్లశానపు రాతి విగ్రహం బయట పడిందని స్థానికులు తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి సమాచారం అందించారు. నాలుగు అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంగల నల్లశానపురాతి చెన్నకేశవ విగ్రహం కాకతీయుల కాలం నాటిదని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయ చివరి పాలకుడైన ప్రతాపరుద్రుడిని బందీగా ఢిల్లీ సుల్తానులు తీసుకెళ్లిన సందర్భంగా స్థానికులు ఈ విగ్రహాన్ని భూమికి 15 అడుగుల లోతులో భద్రపరచారని పేర్కొన్నారు. వాగులో బయల్పడిన విగ్రహానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.