హైదరాబాద్, ఫిబ్రవరి 24 : టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రశ్నపత్రంలో చాయిస్లు, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలను పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, తరచూ మోడల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సర్కారీ విద్యను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుర్తుచేశారు. మన ఊరు – మన బడి పథకం విజయవంతానికి అధికారులు అందరూ కృషిచేయాలని సూచించారు. ఈ పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని తెలిపారు. ఈ పనుల నిర్వహణలో ఇంజినీరింగ్ అధికారులు రాజీపడకుండా పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోనే నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్యదర్శి ఎండీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.