నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ, మార్చి 30 : నిజామాబాద్ రూరల్ మండలం మ ల్లారం గ్రామ పంచాయతీ సీనియర్ కార్యదర్శి ఉమాకాంత్ (53) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.జిల్లా కేంద్ర శివారులోని నాగారం వద్ద మంగళవారం మధ్యా హ్నం టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు, ఐదో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో నివాసముంటున్న ఉమాకాంత్.. ప్రస్తుతం మల్లారం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై మల్లారం గ్రామానికి వెళ్లి, చెరువులో ఉపాధి కూలీలు చేపట్టిన మట్టి పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం జీపీ కార్యాలయంలో సర్పంచ్ నగేశ్ సిబ్బందితో అభివృద్ధి పనులపై చర్చించారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్కు బయల్దేరగా, మార్గమధ్యంలో ఐదో పోలీస్స్టేషన్ సమీపంలో నా గారం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టిప్పర్ ఉమాకాంత్ను ఢీకొట్టింది. టిప్పర్ టైరు తలపై భాగం నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే 5వ టౌన్ పోలీసులకు, మల్లారం సర్పంచ్కు సమాచారమందించారు. రూరల్ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్ నగేశ్, ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉమాకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కొందరు కార్యదర్శులు కన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఉమాకాంత్ అకాల మరణం తీరని లోటని ఎంపీవో మధురిమ, కార్యదర్శులు పేర్కొన్నారు.
పోలీసులు పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జయసుధ, ఎంపీడీవో మల్లేశ్ మృతదేహాన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య సుమిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మోపాల్ మండలం ఏర్పడక ముందు నిజామాబాద్ పాత మండలం ఉన్నప్పుడు కార్యదర్శుల కొరత ఉన్న సమయంలో ఉమాకాంత్ మల్లారం గ్రామంతో పాటు బాడ్సీ, చిన్నాపూర్, న్యాల్కల్ గ్రామాల పంచాయతీలకు కార్యదర్శిగా 19 ఏండ్ల పాటు విధులు నిర్వహించారు.
కేసు నమోదు
డ్రైవర్ పరారీలో ఉన్నాడని, టిప్పర్ను సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జాన్రెడ్డి తెలిపారు.