పాట్నా : మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే కాబోయే భర్త రమ్మన్నాడు.. సంతోషంగా ఆమె వెళ్లింది. కానీ ఆమెను అతికిరాతకంగా నరికి చంపాడు అతను. ఈ దారుణ ఘటన బీహార్లోని నలందా జిల్లాలో చోటు చేసుకుంది.
నూర్పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే వ్యక్తితో ఖుష్బూ(19) అనే యువతికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీన ఇరు కుటుంబాల మధ్య పెళ్లితంతుకు సంబంధించిన పూజలు నిర్వహించారు. ఇక ఇద్దరికి జూన్ 20వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆమెను ఆజాద్ చంపడం సంచలనంగా మారింది.
అయితే తనను కలవాలని కాబోయే భర్త.. ఖుష్బూను కోరాడు. దీంతో ఆమె ఇటీవలే రాత్రి సమయంలో అతని వద్దకు వెళ్లింది. అక్కడ ఆమెను కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం గడ్డివాములో శవాన్ని కప్పిపెట్టాడు. కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది.
ఖుష్బూ సన్నగా ఉందని, అతని కంటే ఎత్తుగా ఉందని స్నేహితులు అనడంతో ఆజాద్లో కాస్త ఆందోళన కలిగి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. యువతి మృతదేహాన్ని గడ్డివాములో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.