విజ్ఞానానికి పేదరికం అడ్డుకాదు: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ, ఏప్రిల్ 4: స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సోమవారం పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,33,947 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. త్వరలో అన్ని శాఖల్లో 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 1,340, నిజామాబాద్ జిల్లాలో 1,976 ఖాళీలు భర్తీ కానున్నాయని వెల్లడించారు.
తన నియోజకవర్గం రెండు జిల్లాలతో ముడిపడి ఉన్నందును రెండు జిల్లాల్లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన యువతకు లబ్ధి చేకూరనున్నదని సంతోషం వ్యక్తంచేశారు. చదువుకు పేదరికం అడ్డుకావచ్చని.. జ్ఞానం, విజ్ఞానానికి అడ్డుకాదని అన్నారు. ఏకాగ్రత, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంలో ఇష్టంగా చదవాలని యువతకు సూచించారు. 60 రోజుల పాటు కష్టపడి చదివితే రాబోయే 60 ఏండ్లు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ నెల 7 నుంచి పీబీఆర్ కోచింగ్ సెంటర్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 60 నుంచి 70 రోజుల వరకు 11 మంది అధ్యాపకులతో క్లాసులు చెప్పిస్తారని తెలిపారు. రూ.4,500 విలువ చేసే 11 పుస్తకాలను ఉచితంగా అందిస్తారని చెప్పారు.