హైదరాబా ద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య బంధువు, ప్రచురణకర్త నిజాం వెంకటేశం గుండెపోటుతో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ అపోలో దవాఖానలో కన్నుమూశారు. సుమారు 6 దశాబ్దాలుగా సాహిత్యంలోనే జీవిస్తూ, అదే శ్వాసిస్తూ అనేక ప్రముఖ గ్రంథాలను ప్రచురించారు. 80వ దశకంలో ‘దిక్సూచి’ అనే కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచారు. పుస్తకాన్ని అమితంగా ప్రేమించే ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తూనే ప్రతినిత్యం గ్రంథాలను అన్వేషించేవారు. తనకు సాధ్యమైనంత వరకు కవులు, రచయితలకు చేదోడువాదోడుగా నిలిచేవారు. వెంకటేశం మృతి సాహితీ లోకానికి తీరని లోటని, ఆయన స్థానాన్ని భర్తీ చేసే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదని పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో నివాళులర్పించారు. వెంకటేశం అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి.