హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వానికి సాహితీ అవార్డు వరించింది. 2021కి గాను ఉమ్మడిశెట్టి సత్యాదేవి 34వ సాహితీ అవార్డుకు ఈ సంపుటిని ఎంపిక చేసినట్టు డాక్టర్ రాధేయ సోమవారం తెలిపారు. అవార్డు ఎంపికలో నాయ్యనిర్ణేతలుగా ప్రముఖ కవి కే శివారెడ్డి, శీలా సుభద్రాదేవి, దర్భశయనం శ్రీనివాసాచార్య వ్యవహరించారు. కవి తన కవిత్వంలో భావగాఢత, లోతైన పరిణతితో అంతర్లీనంగా ఒక కొత్త ప్రపంచాన్ని దర్శింపజేశారని న్యాయనిర్ణేతలు తెలిపారు. కాగా అవార్డు విజేత యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వస్థలం నిజామాబాద్. ఆయనది సాహిత్యంలో అందెవేసిన చేయి. గతంలో 5 కవితా సంపుటాలను వెలువరించారు. ఆయన ఓ దినపత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్గా కొనసాగుతున్నారు. అవార్డు ప్రదానోత్సవాన్ని త్వరలో అనంతపురంలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.