జగిత్యాల : నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని , ఇందుకు పలు ప్రాంతాల్లో న్యాక్ సెంటర్లను నెలకొల్పుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar ) అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని నైట్ కాలేజీలో నేషనల్ అకాడమీ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) సెంటర్ను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాక్ కేంద్రంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ(Free Coaching) పొందవచ్చని సూచించారు. వీరికి శిక్షణతో పాటు భోజన వసతి కూడా ఉంటుందని వెల్లడించారు. ఎలక్ట్రికల్, టైలరింగ్( Tailoring), మిషన్, ప్లంబర్, పెయింటింగ్(Painting) తదితర రంగాల్లో యువతీయువకులకు, మహిళలకు మూడు నెలల టైలరింగ్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తారని వివరించారు.
శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థ నుంచి ఉచితంగా కుట్టు మిషన్లను అందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, పెయింటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారి కొరత ఉందని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా న్యాక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్యమైన శిక్షణ ను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని అన్నారు.
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు .