హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. శనివారం మరో కీలకఘట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం తొలిసారిగా ఏకకాలంలో 35పంపుల ద్వారా కాళేశ్వర జలాలను తరలించడం విశేషం. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్రి వరకు జలాలను నిరంతరాయంగా తరలిస్తున్నారు. లక్ష్మీ పంప్హౌస్ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్ బరాజ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి టన్నెల్స్ ద్వారా నందిమేడారం, గాయత్రి పంప్హౌస్లకు అక్కడి నుంచి వరద కాలువలోకి జలాలను తరలిస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరద కాలువ నుంచి ఎగువన రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంప్హౌస్ల ద్వారా ఎస్సారెస్పీలోకి అర టీఎంసీ జలాలను తరలిస్తున్నారు. మిగిలిన జలాలను వరద కాలువ ద్వారా రాజరాజేశ్వర జలాశయానికి, అక్కడి నుంచి అన్నపూర్ణకు, తద్వారా రంగనాయకసాగర్కు జలాల తరలింపు కొనసాగుతున్నది. కాగా, ప్రాణహితలో వరద క్రమంగా పెరుగుతున్నది. శనివారం సాయంత్రం నాటికి 24,000 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్కు చేరుతుండగా.. ఆదివారం సాయంత్రానికి అది రెట్టింపుకానున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక లక్ష్మీ బరాజ్ నీటినిల్వ సామర్థ్యం 10.8 టీఎంసీలకు చేరుకున్నది.
ఒకవైపు కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ, మరోవైపు అన్నపూర్ణ, రంగనాయకసాగర్లోకి తరలిస్తున్న అధికారులు వానకాలం సాగుకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టారు. అత్యవసరంగా నీరు అవసరమున్న చోట చెరువులను నింపే ప్రక్రియను చేపట్టారు. వరద కాలువపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం 34 ఓటీలను ఏర్పాటు చేసి దాదాపు 157 చెరువులను అనుసంధానించింది. గత వేసవిలో దాదాపులో అన్ని చెరువులను నింపగా, ప్రస్తుతం చాలాచోట్ల చెరువుల్లో 50శాతం మేర నీరు అందుబాటులో ఉంది. కొన్ని చెరువులే పూర్తిగా అడుగంటగా, వాటి పరిధిలోని ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతుండటంతో పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. జలాలను ఎత్తిపోసి అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపాలని ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3టీఎంసీలకు చేరుకున్నది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం అది 2.8 టీఎంసీలకు చేరుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిరంతరాయంగా ఎత్తిపోతలు కొనసాగుతుండడంతో ఈఎన్సీ మురళీధర్ కరీంనగర్లో మకాం వేసి ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కూడా అన్ని పంప్హౌస్లను కలియతిరుగుతూ తరలింపును పరిశీలిస్తున్నారు. గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లకు జలాల తరలింపును పరిశీలిస్తున్నారు.