హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా సోకి, తీవ్ర అనారోగ్య పరిస్థితులకు చేరుకున్నవారిని రక్షించేందుకు ఉపయోగించే టోస్లిజుమాబ్ ఇంజక్షన్లను కేంద్రం తొలిదశలో రాష్ట్రానికి 210 కేటాయించింది. వచ్చే పది రోజుల్లో 80 ఇంజక్షన్లు పేషెంట్లకు అందుబాటులోకి రానున్నాయి. రోషె కంపెనీ ఉత్పత్తిచేస్తున్న ఈ డ్రగ్ కొన్ని వారాల నుంచి దేశంలో లేకుండాపోయింది. ప్రస్తుతం కేంద్రం దీన్ని దిగుమతి చేసుకుంటున్నది. ఈ డ్రగ్ను మన దేశంలో సిప్లా కంపెనీ మార్కెటింగ్, పంపిణీ చేస్తున్నది. లైఫ్సేవింగ్ డ్రగ్గా పేరుగాంచిన టోస్లిజుమాబ్ ఔషధాన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పాజిటివ్ రోగులకు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. నిమ్స్ డైరెక్టర్ మనోహర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు ఇందులో ఉన్నారు. దవాఖానల నుంచి టోస్లిజుమాబ్ అవసరాలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్వీకరిస్తున్నది. ఆయా దవాఖానలకు చెందిన ముగ్గురు ప్రత్యేక వైద్యులు పేషెంట్లకు ఈ మందును సూచిస్తూ సిఫార్సు చేయాలి. టోస్లిజుమాబ్ను సూచించాలంటే పలు అంశాలను వైద్యులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడినప్పటికీ పురోగతి లేనివారికి, సివియర్ డిసీజ్ ఉన్నవారికి, 24-48 గంటల్లోపు ఐసీయూ అడ్మిషన్లో ఉన్నవారికి, మంట పుట్టించే లక్షణాలు ఉన్నవారికి వైద్యుల పర్యవేక్షణలో దీనిని వాడాల్సి ఉంటుంది.