హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఎల్ఐసీలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలోని జాయింట్ ఫ్రంట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సెప్టెంబర్ 12న సమ్మె పిలుపునిచ్చింది. ఫెడరేషన్ ఆఫ్ క్లాస్ వన్ ఆఫీసర్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమ్మెకు సన్నాహకంగా బుధవారం భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8న, 11న భోజన విరామ సమయంలో నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు విధులను బహిష్కరించి సమ్మెకు దిగాలని పిలుపునిచ్చారు. సీబీ సెవెన్ శాఖ బ్రాంచ్ కార్యదర్శి రమేశ్గౌడ్, అధ్యక్షుడు వీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో చేపట్టిన ఆందోళనలో నాయకులు పాల్గొన్నారు.