తానొక ఎమ్మెల్యేననే అహం నేలకు దిగొచ్చింది. ఆక్రమించిన భూములు దశాబ్దాల తర్వాత చెరవీడాయి. నేల తల్లిని నమ్ముకొని పట్టెడన్నం తినే నిరుపేద రైతుల చేతికి తిరిగి వచ్చాయి. మా భూములు మాగ్గావాలె అంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై తిరగబడ్డ దళిత, బహుజన బిడ్డలకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసింది. జమున హేచరీస్ కబ్జాలో ఉన్న 85.19 ఎకరాల నిగ్గుతేల్చి మట్టిమనుషులకు తిరిగి అందజేసింది. రెండు దశాబ్దాల తర్వాత భూతల్లిని ముద్దాడిన అన్నదాతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్కు చేతులెత్తి మొక్కారు. జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పారు.
మెదక్, జూన్ 29 (నమస్తే తెలంగాణ)/వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ కబ్జా చేసిన 85.19 ఎకరాల భూముల చెరవీడింది. సరిగ్గా ఏడాది కిందట ఈటల భూకబ్జాపై గొంతు విప్పిన రైతులు, తమ భూములు తిరిగి ఇప్పించాలని రోడ్డెక్కారు. అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కమిటీ వేసిన ప్రభుత్వం సర్వే చేపట్టింది. బాధితుల నుంచి ఆధారాలు సేకరించి శాస్త్రీయంగా విచారణ జరిపి అక్రమాలను గుర్తించింది. ఎట్టకేలకు 65 మంది భూబాధితులకు బుధవారం పట్టాలు అందజేసింది.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. 20 ఏండ్లుగా తమ భూములు ఈటల రాజేందర్ కబంధ హస్తాల్లో ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు తిరిగి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నదని బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మా దేవుడంటూ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈ భూముల కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని.. భూములు ఇప్పించినందుకు సీఎం కేసీఆర్కు బతికినంత కాలం రుణపడి ఉంటామని బాధిత రైతులు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అచ్చంపేట, హకీంపేటలో భూములను ఈటల రాజేందర్ తన భార్య జమున పేరిట హేచరీస్ ఏర్పాటుకు 85 ఎకరాలు కబ్జా చేశారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం 30 ఏండ్ల కింద ట నిరుపేదలకు భూములను కేటాయిస్తే, ఆ భూముల్లోకి రైతులను రానివ్వకుండా జమునా హేచరీస్ పేరుమీద భారీ షెడ్లు నిర్మించారని చెప్పారు. బాధిత రైతులకు తిరిగి పట్టాలను అందజేసి ప్రభుత్వం న్యాయం చేసిందని పేర్కొన్నారు. రైతులకు తిరిగి ఇచ్చిన భూము ల్లో ఏ పంటలు వేసుకున్నా ప్రభుత్వ సహకారం అందిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి హామీ ఇచ్చారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేట సర్వే నంబర్లు 97, 111లో బలహీనవర్గాలకు చెందిన 70.33 ఎకరాల సీలింగ్, అసైన్డ్ భూములను జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్.. తెలంగాణ అసైన్డ్ భూములు (బదిలీ నిషేధం) చట్టం 1977లోని నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఆక్రమించింది. అచ్చంపేటలో 77, 78, 79, 80, 82, 130, హకీంపేట గ్రామంలోని సర్వేనంబర్ 97లో అసైన్డ్, సీలింగ్ భూముల్లో రోడ్లు వేసి, బాధిత రైతులను వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకొన్నది. బాధితుల్లో బీసీలు 53 మంది, ఎస్టీలు 3, ఎస్సీలు 9 మంది ఉన్నారు.
జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్.. తెలంగాణ వ్యవసాయ చట్టం-2006 ప్రకారం వ్యవసాయేతర భూమార్పిడి అనుమతులు పొందకుండా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారు సర్వేనంబర్ 78, 81, 130లలో భారీ పౌల్ట్రీ షెడ్లు, ఫ్లాట్పాంలు, రోడ్లు నిర్మించింది. అచ్చంపేట శివారులో సర్వేనంబర్లో 81లో 5 ఎకరాలు, సర్వేనంబర్ 130లో 3 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, జమున హేచరీస్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొన్నది. జమున హేచరీస్ అక్రమంగా కబ్జాచేసిన అసైన్డ్ భూములు 70.33 ఎకరాలు కాగా, రెవెన్యూ అధికారుల సర్వేలో మరో 15 ఎకరాలు అసైన్డ్ భూమి ఉన్నట్టు గుర్తించారు.
2014లో మా భూమిలో మొక్కజొన్న పంట వేశాం. నీళ్లు లేక పంట పండకపోవడంతో కూలిపనుల కోసం మేడ్చల్ వెళ్లాం. ఊరిలో లేకపోవడంతో మా భూమిని కబ్జాచేశారు. మేము వెళ్లి అడిగితే, భూముల దగ్గరకు రాకుండా గేటు పెట్టిండు. ఈ రోజు మా భూములు మాకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. మా భూముల్లో ఉన్న కోళ్ల షెడ్లను తీసెయ్యాలి.
– సాకలి రాజమణి, అచ్చంపేట