హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతకం చేశారు. తీర్మానం ప్రతిని సీఎం కేసీఆర్ చదివి.. సభ్యుల ఆమోదం పొందారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అక్టోబరు 5వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పార్టీ నియమావళిలో సవరణలు చేయడం జరిగింది’. అని చదివారు. దీనికి సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. పార్టీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలపై ఎన్నికల సంఘానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను గురువారం ఉదయం ఢిల్లీలో ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం గురువారం ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖ యథాతథంగా..
తేదీ.5-10-2022
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,
నిర్వాచన్ సదన్, అశోకా రోడ్,
న్యూఢిల్లీ – 110 001.
తెలంగాణ రాష్ట్ర సమితి అక్టోబరు 5, 2022న జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఇదే సమావేశంలో పార్టీ రాజ్యాంగంలో సవరణలకు సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణ అంశాలను సమర్పించడం జరుగుతుంది.