Icchampally Project | హైదరాబాద్, ఏప్రిల్ 18 (మ్యాకం రవికుమార్- నమస్తే తెలంగాణ): తమిళనాడులో స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆ కుట్రలకు పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కారు వంతపాడుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, ఛత్తీస్గఢ్ పెడుతున్న పేచీలు ఇందుకు నిదర్శనం. ‘గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద మరో బరాజ్ను నిర్మించడం సాధ్యం కాదు. అదే జరిగితే తెలంగాణ ఇప్పటికే ఇచ్చంపల్లి ఎగువన నిర్మించిన లక్ష్మీబరాజ్, దిగువన నిర్మించిన సమ్మక్కసాగర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి, ఈ ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి చేపట్టేందుకు ఏమాత్రం ఒప్పుకోం’ ఇదీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టంచేసింది. దీంతో ఆ రెండు వాదనలను బలహీనపరిచి, తమిళనాడుకు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ప్రతిపాదిత ఇచ్చంపల్లి బరాజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు తెర వెనుక కుట్రలకు బీజేపీ పూనుకుంటున్నది. దక్షిణ భారత్లో పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటినుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది.
కానీ, పట్టు చిక్కడం లేదు. దీంతో తాజాగా తమిళనాడు మీద దృష్టి పెట్టింది. తమిళనాడు ఎదుర్కొంటున్న తీవ్రమైన సాగు, తాగు నీటి కొరతనే ప్రధాన అస్త్రంగా ఎంచుకొని, ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, మొండిగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోతున్నది. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీల నికర జలాలను కావేరికి తరలించాలని నిర్ణయించింది. అందుకోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను నిర్మించి అక్కడి నుంచి కాలువ ద్వారా మూసీకి, ఆ తరువాత నాగార్జునసాగర్కు, అక్కడి నుంచి ఏపీలోని సోమశిల రిజర్వాయర్కు, అక్కడి నుంచి తమిళనాడులోని మమండూర్ ట్యాంక్కు, ఆ తరువాత మనిముక్త నది వరకు గోదావరి జలాలను తీసుకెళ్లనున్నది. 1,085 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు ప్రాంతానికి నీళ్లను తరలించేందుకు గోదావరి ఒడ్డునే ఉన్న తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న ది. అందుకోసం తెలంగాణ ప్రాజెక్టును సైతం బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నది. మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు బలాన్నిస్తున్నాయి.
ఎన్డీఎస్ఏను పావుగా చేసి మేడిగడ్డ నిర్వీర్యం
తమిళనాడులో బీజేపీ లక్షిత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే వ్యూహంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను నిర్మించాలంటే, కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నది. ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను నిర్మిస్తే, అక్కడి బ్యాక్వాటర్ ఎగువన మేడిగడ్డ బరాజ్ వరకూ విస్తరిస్తాయి. అది మేడిగడ్డ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ ఇచ్చంపల్లిని వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో ఇప్పటివరకు కేంద్రం ముందుకు పోలేకపోయింది. ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ కుంగుబాటును ఆసరాగా చేసుకొని, ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ వేగంగా పావులు కదుపుతున్నది. మేడిగడ్డ బరాజ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటున్నది. బరాజ్ కుంగుబాటుకు గురైన వెంటనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని రంగంలోకి దింపింది.
ఈ కమిటీ ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయంటూ రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చింది. తదుపరి నివేదిక వచ్చేంతవరకూ బరాజ్లో నీటిని నిల్వ చేయొద్దని ఆదేశించింది. ఆ తరువాత మూడు నెలల వరకు బరాజ్ వైపు కన్నెత్తి చూడలేదు. మార్చి మొదటి వారంలో బరాజ్ ప్రమాద అధ్యయనం, పునరుద్ధరణ పనుల సిఫారసుల కోసం పేరుకు నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పటికీ నివేదికను ఇవ్వలేదు. ఒకవైపు ఈ ఏడాది గోదావరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తున్నా, బరాజ్ రక్షణపై ఆసక్తి చూపడం లేదు. కనీసం తాత్కాలిక మరమ్మతు పనులనైనా సిఫారసు చేయడం లేదు. బరాజ్ను పూర్తిగా వరదలకు వదిలేసి, ఇప్పటికే జరిగిన నష్టాన్ని మరింతగా విస్తరించేలా చేసి, మొత్తంగా మేడిగడ్డ బరాజే పనికిరాదని నిర్ధారించేలా ఎన్డీఎస్ఏ వ్యవహార శైలి ఉన్నదనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మరమ్మతు పనులకు సిఫారసు చేసినా, వాటిని చేపట్టేలోగా వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నదని ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఆ పనులను ఇప్పుడు చేసే అవకాశమే లేదని తేల్చిచెప్తున్నారు. దీంతో ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకుని ఎగువన మేడిగడ్డ బరాజ్ను నిర్వీర్యం చేయాలన్న బీజేపీ సర్కార్ కుట్ర సఫలీకృతం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
దేశంలో ఎక్కడాలేని విధంగా షరతులు
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటి వనరులను సమకూర్చేందుకు సమ్మక్క బరాజ్ను తెలంగాణ సర్కార్ నిర్మించింది. ఆ బరాజ్లో నీటి నిల్వ వల్ల తమ రాష్ట్రంలోని భూములు ముంపునకు గురవుతాయని ఛత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నది. సీడబ్ల్యూసీకి సైతం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సమర్పించిన సమ్మక్క బరాజ్ డీపీఆర్ను సీడబ్ల్యూసీ ఛత్తీస్గఢ్ పరిశీలనకు పంపింది. ఆ తరువాత అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలంటే, పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని తీసుకోవాలని తెలంగాణకు సూచించింది. ఎన్వోసీ ఇస్తేనే ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపింది. సమ్మక్క బరాజ్ ఎఫ్ఆర్ఎల్ (పూర్తిస్థాయి నీటినిల్వ) 83 మీటర్లు కాగా, ఆ మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు మాత్రమే ఛత్తీస్గఢ్లో భూములు ముంపునకు గురవుతాయని, ఆయా భూములకు పరిహారం చెల్లిస్తామని, అప్పటివరకు 80 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తామని తెలంగాణ హామీ ఇచ్చింది.
ముంపునకు గురయ్యే భూములు, పరిహారం నిర్ణయించి ఆ మేరకు వ్యయాన్ని తెలిపితే నిధులు చెల్లిస్తామని ఛత్తీస్గఢ్ ఎదుట తెలంగాణ ప్రతిపాదించింది. గత నవంబర్లోనే ఛత్తీస్గఢ్ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. ముంపు తదితర అంశాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఎన్వోసీ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్లోని అప్పటి కాంగ్రెస్ సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. కానీ, ఆ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్త మెలిక పెట్టింది. ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల వరకు కాకుండా, హెచ్ఎఫ్ఎల్ (హైఫ్లడ్ లెవల్) 88 మీటర్ల వరకు ముంపునకు గురయ్యే భూములకు సైతం పరిహారం చెల్లించాలని షరతు విధించింది. వాస్తవంగా దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా ఎఫ్ఆర్ఎల్ వరకు మాత్రమే పరిహా రం చెల్లిస్తున్నారు. హెచ్ఎఫ్ఎల్ వరకు భూసేకరణ అనేది ఇప్పటివరకు దేశంలోనే ఉనికిలో లేదు. అయినప్పటికీ ఎక్కడాలేనివిధంగా ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కార్ కొత్త మెలిక పెట్టింది. సమ్మక్క బరాజ్కు సీడబ్ల్యూసీ అనుమతులు రాకుండా చేసి, వెరసి పూర్తిస్థాయిలో అంటే 83 ఎఫ్ఆర్ఎల్ వరకు నీటిని నింపకుండా చూసి, ఇచ్చంపల్లిని నిర్మించాలనే కుట్రలో భాగంగానే ఛత్తీస్గఢ్ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఇదంతా చేస్తున్నదనే విమర్శలున్నాయి. మొత్తంగా తమిళనాడు కోసం మేడిగడ్డను, సమ్మక్క బరాజ్ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ను ముందుపెట్టి సమ్మక్క బరాజ్కు ఆంక్షలు
ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి మరో అడ్డంకిగా దిగువన ములుగు జిల్లాలో తుపాకులగూడెం వద్ద గోదావరిపై తెలంగాణ నిర్మించిన సమ్మక్క బరాజ్ నిలుస్తున్నది. ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే, సమ్మక్క బరాజ్ నీటి నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో గోదావరి-కావేరి లింక్కు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ అడ్డు చెప్తూ వచ్చింది. దీంతో సమ్మక్క బరాజ్ అంశాన్ని కూడా ఉనికిలో లేకుండా చేసేందుకు బీజేపీ సర్కారు కుట్రలకు తెరలేపింది. ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కారును ముందుపెట్టి తెరవెనక రాజకీయాలు కొనసాగిస్తున్నది. కేంద్రం కుట్రలకు ఛత్తీస్గఢ్ సర్కారు సైతం వంతపాడుతున్నది. నిన్నమొన్నటి తాము వినియోగించుకోని 148 టీఎంసీల నికర జలాలను తరలించుకుపోయేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ససేమిరా అన్నది. ఇటీవల అక్కడ బీజేపీ ప్రభుత్వం రావడంతో మాట మారింది. నికర జలాల తరలింపునకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని ఎన్డబ్ల్యూడీఏనే రాష్ర్టాలకు వెల్లడించింది.