Eco Friendly Ganesh | పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తోందని, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం జరుగుతోందన్నారు. చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణహిత గణేశ్ విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండపాల్లో, ఇండ్లలోనూ పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజించాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మట్టి గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా కలుషితమయ్యే నీటిని నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.