రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో లీగల్ సెల్ను ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ
హైదరాబాద్, జులై 18 (నమస్తే తెలంగాణ): మహిళా సమస్యల పరిష్కారానికి లీగల్సెల్ ‘వన్ స్టాప్ సెంటర్’లా దోహదం చేస్తుందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ పేర్నొన్నారు. మహిళలకు న్యాయ సహాయాన్ని అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు. మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి హైదరాబాద్లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్సెల్ను సోమవారం ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతలక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కుల రక్షణకు, ఉచితంగా న్యాయ సేవలు పొందేందుకు ఈ లీగల్సెల్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ప్రతి నెలా మూడో శనివారం ‘స్వరక్ష-డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్రమ రవాణాకు గురవుతున్న వారిని రక్షించి, వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.