పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ): తన కొడుకు, కోడలు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసులో ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉన్నదని గట్టు కిషన్రావు ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వామన్రావు దంపతులు వేసిన కేసులను ఎదుర్కోలేకనే హత్య చేశారని తెలిపారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ దంపతులను సరైన పద్ధతిలో విచారిస్తే చాలామంది పేర్లు బయటికి వస్తాయని చెప్పారు. పుట్ట మధుకు సదరు మాజీ మంత్రి పూర్తిగా సహకరించాడన్నారు. పోలీసులు సరైన పద్ధతిలో విచారణ జరపకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతానని చెప్పారు. హైకోర్టు జడ్జికి కూడా లేఖ రాస్తానని, ఢిల్లీ తంతెలు ఎక్కడానికి కూడా వెనుకాడబోనన్నారు.