హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే ఓ రణరంగం. ఆ రాజకీయ కురుక్షేత్రంలో రక్తం చిందని ఎన్నికల్లేవ్. ఎటుచూసినా పోటాపోటీ నినాదాలు.. తోపులాటలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, ఒక్కోసారి భాష్పవాయువుల ప్రయోగాలు. వీటికితోడు భారీస్థాయిలో రిగ్గింగులు, బ్యాలెట్ ఎత్తుకెళ్లే ఘటనలు. రోడ్లపై విర్రవీగుతూ చిందులేసే ప్రత్యర్థి వర్గాలు. ఒక్కో పోలింగ్ బూత్ వద్ద నలుగురైదుగురు పోలీసు సిబ్బంది పహారా కాస్తే.. బయట ఆయా పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు మరో నలుగురైదుగురు సిబ్బంది ఉండాల్సి వచ్చేది.
స్వరాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా పరిఢవిల్లుతున్నాయనే దానికి నిదర్శనం గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఎక్కడో ఓ చోట కొద్దిపాటి తోపులాటలు తప్పా.. ఒక్కటంటే ఒక్క భారీ సంఘటన జరిగిన దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘానికి పోలీసుశాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ‘ఎన్నికల యాక్షన్ ప్లాన్’ విజయవంతంగా అమలైంది. చాలా చోట్లా యువ ఐపీఎస్ అధికారులు ముందుండి సిబ్బందిని నడిపించిన తీరు అద్భుతం. ఈ విషయాన్ని స్వయం గా డీజీపీ అంజనీకుమార్ ఆడియో సందేశంలో కొనియాడటం మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం.
4,400 సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు కేంద్ర బలగాలతో మోహరించారు. ముందుగానే ఓటర్లను చైతన్యపరిచి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల మినహా ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక్కో పోలింగ్ బూత్కు అవసరమైన చోట కానిస్టేబుల్, హోంగార్డు, ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న చోట ఓ హోంగార్డు/కానిస్టేబుల్తోనే భద్రత నిర్వహించారు. అయినా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించారు.
ఈ దఫా ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో మావోయిస్టులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. ఎన్నికలు నిర్వహిస్తుండగానే ఛత్తీస్గఢ్లో విధ్వంసాలకు పాల్పడ్డారు. అయితే, తెలంగాణలోని 13 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ దఫా ఐదు రాష్ర్టాలకు చివరిగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని జాతీయ మీడియా సైతం కొనియాడింది. ఇక్కడి భద్రత, ఎన్నికల ప్లాన్ను ప్రభుత్వంతో కలిసి అమలు చేయడంలో ఎన్నికల సంఘం విజయం సాధించిందని ఉన్నతాధికారులు సైతం మెచ్చుకొన్నారు.