మాదాపూర్, ఏప్రిల్ 24: పాంక్రియాటిక్ క్యాన్సర్ సోకిన వ్యక్తికి కొండాపూర్ వైద్యులు విపుల్స్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ విధానంతో శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు. కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డాక్టర్ సీహెచ్ నవీన్కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డాక్టర్ మధులిక ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి (49)కి పచ్చకామెర్లు, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలు రావడంతో వైద్యం కోసం పలు దవాఖానలు తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరగా అతడు కొండాపూర్లోని కిమ్స్ దవాఖానకు వచ్చాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పాంక్రియాటిక్ క్యాన్సర్ అని తేల్చారు. క్లోమం, దాని చుట్టు పక్కల భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణాలను తొలగించడానికి సాధారణ శస్త్రచికిత్స కన్నా విపుల్స్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ విధానంలో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. సాధారణ ఆపరేషన్లా కాకుండా ఈ విధానంలో శరీరానికి చిన్నపాటి రంధ్రం మాత్రమే చేయడం వల్ల గాయాలు త్వరగా నయమవుతాయని, రోగి త్వరగా కోలుకుంటాడని, నొప్పి తక్కువగా ఉంటుందని తెలిపారు. సదరు రోగికి ఆరు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి క్యాన్సర్ సోకిన భాగాలు.. పాంక్రియాస్ (క్లోమం) తల భాగం, చిన్న పేగుల్లోని కొంత భాగం, ఆంత్రమూలం, పిత్తాశయం వంటి భాగాలను కొంత వరకు తొలగించామని పేర్కొన్నారు. వారం రోజుల అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జి చేశామని తెలిపారు.