హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ద్వారా ల్యాండ్ యూజ్ స్టేటస్ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరాలు, పట్టణాల్లో భూములను కొనుగోలు చేసేవారు ఆ భూమి మాస్టర్ ప్లాన్లో ఏ క్యాటగిరీ పరిధిలో ఉన్నదో తెలుసుకునేందుకు వీలయ్యే ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును త్వరలో డీటీసీపీ పరిధిలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, అగ్రికల్చర్ జోన్లలో కొనుగోలుకు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములు ఏ క్యాటగిరీ పరిధిలో ఉన్నాయన్న విషయాన్ని ఈ విధానంలో అధికారికంగా చెప్తారు. ఈ వివరాలు కావాల్సినవారు టీఎస్బీపాస్ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నంబర్ నమోదుచేస్తే ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఇస్తారు. వాణిజ్య, రెసిడెన్షియల్ భవనాల నిర్మాణానికి భూములను కొనుగోలు చేసేవారు ఆయా భూములకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం అన్వేషిస్తుంటారు. అలాంటివారిని విక్రయదారులు తప్పుడు సమాచారంతో మోసగిస్తుంటారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే టీఎస్బీపాస్లో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సర్వీసును పొందాలనుకునేవారు https://lui.tsbpass.telangana. gov.in./ వెబ్సైట్ లింక్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.