హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 21 (నమస్తే తెలంగాణ): అనధికారిక లేఅవుట్ ప్లాట్ల విషయంలో రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. డాక్యుమెంట్లోని రిజిస్ట్రేషన్ తేదీన ఉన్న భూమి మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది. రెండ్రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను పెంచిన నేపథ్యంలో క్రమబద్ధీకరణ చార్జీలకు ఎప్పటి భూమి విలువను ప్రాతిపదికగా తీసుకొంటారని చాలామందికి సందేహాలు వచ్చాయి. దీనిపై ఓ టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా 2020 ఎల్ఆర్ఎస్ పథకం ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకా రం.. ‘రిజిస్ట్రేషన్ అయిన తేదీనాటి భూమి విలువ (డాక్యుమెంట్లోని విలువ)’ ఆధారంగానే 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు, ఇతర చార్జీలను లెక్కిస్తారని స్పష్టంచేశారు. దరఖాస్తులను గురువారం నుంచి పరిష్కరించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. హెచ్ఎండీఏ పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
మూడు దశల్లో ప్రక్రియ
దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మూడు దశల్లో చేపట్టనున్నారు. దరఖాస్తులను వార్డులు, ప్రాంతాల ప్రాతిపదికన క్లస్టర్లుగా విభజించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులతో సంబంధిత జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ఏర్పాటు చేసే బృందాలు దరఖాస్తులవారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతాయి. సదరు ప్లాటు ప్రభుత్వభూమిలో ఉన్నదా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదా? వంటి అంశాలను పరిశీలించి దరఖాస్తు క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉన్నదా? లేదా? అన్న దానిపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వ ఆదేశాలతో క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న ప్లాట్ల యజమానులకు ఎంత ఫీజు చెల్లించాలనే వివరాలతో నోటీసులు జారీ చేయనున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు.
పెండింగ్ దరఖాస్తులకూ మోక్షం
క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్-2020 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు కూడా మోక్షం కలుగనున్నట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,06,891, హెచ్ఎండీఏ పరిధిలో ఫీజులు చెల్లించాల్సినవి 14,425, ఫైనల్ ప్రొసీడింగ్స్ కోసం పీవోల వద్ద పెండింగులో ఉన్నవి 104, డిజిటల్ సైన్ చేయకుండా ఉన్న ఫైనల్ ప్రొసీడింగ్స్ 633, షార్ట్ఫాల్స్ 17 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.