ఉట్నూర్, నవంబర్ 23 : లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు లేని లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపినట్టు ఆరోపించారు. ఇటీవలే సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ రకంగా కలిపారో తెలుపాలని నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. బ్రిటిష్ కాలంలో ఆదివాసీ నాయకులు జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమాలు చేశారని, అప్పుడు లేని లంబాడాలు ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు.
ఎస్టీ హోదాలో ఉన్న ఆదివాసీలు ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ వంటి ఉద్యోగాలు పొందకపోవడానికి లంబాడాలు రిజర్వేషన్లను పూర్తి గా వాడుకోవడమే కారణమని చెప్పారు. బేల మండలంలో 100 పైగా కుటుంబాలు వలసవచ్చి ఎస్టీ హోదా అనుభవిస్తున్నారని గుర్తించి వారి సర్టిఫికెట్లు రద్దు చేయించామని గుర్తుచేశారు. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమల చేసి లంబాడాలను తొలగించాలని, ఏజెన్సీ డీఎస్పీ నిర్వహించి ఆదివాసీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర సమయంలో లంబాడాలను ఎస్టీ జాబితాలో కలుపడంతో ఆదివాసీ సమాజం పూర్తిగా నష్టపోయిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీలు సుప్రీంకోర్టులో కేసు వేయగా .. ఎస్టీలో లంబాడాలను ఏ రకంగా కలిపారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఈ ప్రభుత్వాలు ఇప్పటికి రిైప్లె ఇవ్వలేదన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లంబాడా అభ్యర్థిపై 23 వేల ఓట్లతో గెలిచానని చెప్పారు. శ్యాంనాయక్, అతని భార్య రేఖానాయక్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసని, జాతికోసం పోరాటాలు చేస్తున్నామన్న సోయం బాపురావు, ఆత్రం సక్కులు ఎందుకు సభకు రాలేదో చెప్పాలని నిలదీశారు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి. 1956 కంటే ముందు జాబితాలను పరిశీలించి ఉద్యోగాలు ఇతర పథకాలు పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలో పీసా చట్టం అమలు చేసి, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. పీవీటీజీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి, ఏజెన్సీలో చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి. లంబాడాల చేర్పుపై సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు జవాబు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లంబాడాలను తీసుకోవద్దు. నీట్ ఇతర విద్యా అవకాశాలలో ఆదివాసీలకే సీట్లు కేటాయించాలి. ఎస్టీ జాబితాలో లంబాడాలను తొలగించి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వారికి ఎస్టీ హోదా కల్పించొద్దు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులు పాల్గొన్నారు.