యాదాద్రి, మార్చి10: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికత కల్గించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొండపైన స్వామివారి కోసం విష్ణు పుష్కరిణి నిర్మించగా.. భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు కొండ కింద ఉన్న గండిచెరువు వద్ద లక్ష్మీపుష్కరిణి నిర్మాణం చేపట్టారు. ఏకకాలంలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానం చేసేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. రూ.11.55 కోట్లతో 2.47 ఎకరాల్లో.. 43 మీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పు, 4 ఫీట్ల లోతుతో పుష్కరిణి నిర్మిస్తున్నారు. 15 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యంతో చేపట్టిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. లక్ష్మీ పుష్కరిణిని గోదావరి జలాలతో నింపేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.