యాదాద్రి, ఆగస్టు 16 : యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనరసింహుడికి మంగళవారం నిత్యోత్సవాలు పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిపించారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన, నిజాభిషేక పర్వాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవేరులను దివ్యమనోహరంగా ముస్తా బు చేసి ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో గజవాహనంపై ఊరేగించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా నిత్య తిరుకల్యాణాన్ని జరిపారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవలను అత్యంత వైభవంగా చేపట్టారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు. పాతగుట్టలోనూ స్వామివారి నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.25.13 లక్షలు సమకూరినట్టు ఈవో తెలిపారు.