హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): అర్చకులకు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉద్దేశించిన అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు 4 రోజుల క్రితమే మంత్రి సంతకం చేశారని చెప్పారు. ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో అర్చక సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రమణాచారి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. అర్చక సంక్షేమనిధిలో నిధులకు కొరతలేదని, అవసరమైన పథకాలను అమలుచేసేందుకు కృషిచేస్తామని హామీఇచ్చారు. అర్చకుల పిల్లలకు చదువులు, వైద్యం, తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ధూప, దీప, నైవేద్య పథకం వేతనాలను 2,500 నుంచి 6 వేలకి పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. అర్చకుల స్థితిగతులను మార్చేందుకు కేసీఆర్ కృషిచేస్తున్నారని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి సీఎంను తాను ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో మరొకరు రారని స్పష్టంచేశారు. ధూప, దీప, నైవేద్య పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించేందుకు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సంఘం ప్రతినిధులు అర్చకుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రమణాచారికి సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే పురాణం సతీశ్కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, గంగు కృష్ణచైతన్య, రామలింగేశ్వరశర్మ, మారుతి సత్యనారాయణశర్మ, శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు, నందనం హరికిషన్శర్మ తదితరులు పాల్గొన్నారు.