మూసాపేట(చిన్నచింతకుంట)/దేవరకద్ర రూర ల్, అక్టోబర్ 31: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభువుగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టం ఉద్దాల ఊరేగింపు లక్షలాది మంది భక్తుల మధ్య కనులపండువగా నిర్వహించారు.
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. దళితులు దీపావళి నుంచి 10రోజులు ఒంటి పూట భోజనంతో అతిపవిత్రంగా ఉంటూ నియమ నిష్ఠలతో ఆవు చర్మంతో తయారు చేసిన ఉద్దాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దంపతులు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి, శ్రీరాంభూపాల్, మధుసూదన్రెడ్డి, ప్రదీప్గౌడ్, సురేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం చాటలో ఉద్దాలను ఉంచి ఊరేగించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.