అమెరికన్, తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు
అట్లాంటా, జూలై 4 : తెలుగు నేలపై ప్రాణం పోసుకొన్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకొంటూనే ఉన్నది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అంట్లాంటాలో 17 ఏండ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన స్థానిక అమెరికన్లతోపాటు ఆహుతులైన తెలుగువారిని ఆకట్టుకొన్నది. అట్లాంటాలో పలు సాఫ్ట్వేర్ సంస్థలు నిర్వహిస్తున్న నల్లగొండ జిల్లా అనుముల మండలం అల్వాలకు చెందిన వేణుకుమార్రెడ్డి, వాసవి దంపతుల కుమార్తె లహరి 8 ఏండ్ల వయసు నుంచే కూచిపూడి నృత్యం నేర్చుకొన్నది.
ఆదివారం రాత్రి అట్లాంటాలో లహరి తొలి ప్రదర్శన అందరినీ అలరించింది. కూచిపూడిలో అత్యంత కఠినమైన 100 రకాల పాదముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్తముద్రలు, కండ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించింది. ఆమె నాట్య ప్రదర్శన 4 గంటల పాటు నిర్విరామంగా సాగింది. వేణుగోపాల్రెడ్డి పిసికె 25 ఏండ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు.