Minister KTR | న్యూఢిల్లీ, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పట్టణాలు, నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతోపాటు పేదల సంఖ్య కూడా పెరుగుతున్నదని.. వారికి ఉపాధి కల్పించటం తక్షణ అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్గోయల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి వివరించి సహకారం అందించాల్సిందిగా కోరారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపించారని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, డబుల్బెడ్రూం ఇండ్ల వంటి మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రులు ఎంతో ఆసక్తి కనబర్చారని చెప్పారు.
పారిశుద్ధ్యంపై ప్రశంసలు
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ఏడు అంశాలపై చర్చించినట్టు భేటీ అనంతరం కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ గురించి వివరించినట్టు చెప్పారు. దీనిద్వారా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించటమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చని చెప్పినట్టు పేర్కొన్నారు. వినూ త్న శానిటేషన్ హబ్ వల్ల పట్టణాభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందని వివరించినట్టు తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ తన నమూనాను, ఆలోచనలను ఇతర రాష్ర్టాలతో పంచుకోవాలని, త్వరలోనే ఢిల్లీలో నిర్వహించే సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రి కోరినట్టు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్టు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు ఆమోదం తెలపాలని.. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగో ల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల దూరం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞపి చేసినట్టు చెప్పారు.
మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోండి
తెలంగాణ నుంచి 2022-23 యాసంగి సీజన్కుగాను మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ విన్నవించారు. ఈ యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశామని, ఇది దేశం మొత్తం వరిసాగులో 50 శాతం కంటే ఎక్కువని వివరించారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 66.11 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, కేంద్రం 10.20 లక్షల టన్నులే తీసుకొనేందుకు అంగీకరించిందని గుర్తుచేశారు. లక్ష టన్నుల ధాన్యం సేకరణకు 52 కోట్లు ఖర్చవుతున్నదని, మిగిలిన 34.24 లక్షల టన్నుల కోసం 1,441 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. అందువల్ల కేంద్రం అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని పీయూష్గోయల్ చెప్పినట్టు కేటీఆర్ వెల్లడించారు.
జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ వీలైనంత త్వరగా ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించినట్టు చెప్పారు. ఢిల్లీ టీయూడబ్ల్యూజే -143 నేతలు కేటీఆర్ను శనివారం కలిసి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులందరికీ స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. హైదరాబాద్లోని జర్నలిస్టులందరికీ స్థలాలు ఇస్తామని, అందులోనే ఢిల్లీలోని తెలంగాణ జర్నలిస్టులను సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీతోపాటు హైదరాబాద్లని జర్నలిస్టులందరికీ ఒకేసారి ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో టీయూడబ్ల్యూజే నిర్వహిస్తున్న కార్యక్రమాల డైరీని కేటీఆర్కు యూనియన్ నేతలు అందజేశారు. మంత్రి వెంట ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ ఉన్నారు.
రోడ్ల నిర్మాణానికి రూ.800 కోట్లివ్వండి
హైదరాబాద్ నగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం విజయవంతంగా నడుస్తున్నదని, ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం పూర్తిచేశామని కేటీఆర్ తెలిపారు. మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో రూ.800 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని హర్దీప్సింగ్ పురిని కోరినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య వాహనాల కొనుగోలు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు వివరించారు. రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం తరఫున రూ.450 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణానికి రూ.3,722 కోట్లు ఖర్చు అవుతున్నదని, ఇందులో కనీసం 20 శాతం ( రూ.744 కోట్లు) కేంద్ర భరించాలని కోరినట్టు కేటీఆర్ చెప్పారు. కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద రూ.3,777 కోట్లతో బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో రూ.750 కోట్లు కేంద్రం అందించాలని కోరినట్టు వెల్లడించారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.