హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు సూచించారు. ఆదివారం ఆయన ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరును పరిశీలించేందుకు మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కమిటీకి జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ ద్వారానే సీఎం కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన సమాచారం, అభిప్రాయాలు తీసుకుంటారని చెప్పారు.
ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి శాసనసభ్యుడు అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. పార్టీకి, ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించుకునేందుకు ఈ బృందాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ప్రతి ఆత్మీయ సమ్మేళనాన్ని కచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేయాలని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలను మే నెల వరకు కూడా కొనసాగించవచ్చునని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రతి ఒకరూ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. తెలంగాణ సాధించిన అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడే ప్రజాప్రతినిధులను, వక్తలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారుచేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.