హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ) : జర్నలిజం, కమ్యూనికేషన్ విభాగంలో పీహెచ్డీలో భాగంగా చేసిన పరిశోధనకు బంగారు పతకం సాధించిన తన పీఆర్వో మాణిక్య మహేశ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ద్వారా ‘గ్రామీణ అభివృద్ధిలో కమ్యునికేషన్ వ్యూహాల మూల్యాంకనం’ అనే అంశంపై ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో మహేశ్ పరిశోధన చేశారు. ఈ మేరకు డాక్టరేట్ డిగ్రీతోపాటు బంగారు పతకాన్ని మహేశ్కు తెలుగు వర్శిటీ ప్రదానం చేసింది.
ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని ప్రజల వద్దకు మరింత వేగంగా, సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కమ్యునికేషన్ వ్యూహాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహేశ్ తన అధ్యయనంలో గుర్తించారు. రవీంద్రభారతిలో ఇటీవల నిర్వహించిన తెలుగు వర్సిటీ 15వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా మహేశ్ బంగారు పతాకాన్ని అందుకొన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ను అభినందించిన మంత్రి కేటీఆర్, ఆయన చేసిన పరిశోధన తాలూకు వివరాలను అడిగి తెలుసుకొన్నారు. భవిష్యత్తులో జర్నలిజం, కమ్యునికేషన్ రంగంలో అధ్యయనాన్ని ఇంతే నిబద్ధతతో కొనసాగించాలని మంత్రి ఆయనకు సూచించారు.