హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 4వ విడత ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన-2022ను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించగా 163 సరికొత్త ఆవిష్కరణలు వచ్చాయని టీఎస్ఐసీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సరికొత్త ఆవిష్కరణలు ప్రదర్శించిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడమే కాకుండా వాటిని తయారు చేసి, మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటుందని భరోసా ఇచ్చారు. ఆవిష్కర్తలు తమ వినూత్న కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో కీలకంగా మారాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3ఐ మంత్ర అయిన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత వృద్ధి)కు నిరంతరం పాటుపడుతున్నదని తెలిపారు. టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం మాట్లాడుతూ.. గత మూడేండ్లలో టీఎస్ఐసీ 150 ఆవిష్కర్తలను గుర్తించిందని, ఇందులో 40 గ్రామీణ ప్రాంతాలకు చెందినవని చెప్పారు. వారి ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు అవసరమైన మార్గనిర్దేశం, ప్రొటోటైప్, ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపారు.