కంటోన్మెంట్/బొల్లారం/ఉప్పల్, సెప్టెంబర్ 8: తమను ఎందుకు అడ్డుకుంటున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగారు. తోటి పోలీసులు కూడా పూనకంతో ఊగిపోయారు. దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం చెక్పోస్టు వద్ద అడ్డుకున్నారు. సాఫీగా వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలీసులను ప్రశ్నించారు. అంతే అక్కడున్న పోలీసులు రెచ్చిపోయారు.

‘ఎవడ్రా నువ్వు’ అంటూ దౌర్జన్యంగా ప్రదర్శించారు. పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులను ముందుకు వెళ్లనీయకుండా కాన్వాయ్ను పోలీసులు అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరుపై కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కౌశిక్రెడ్డి మండిపడ్డారు. తమ నాయకుడిని కాపాడుకోవడానికి వెళ్తుంటే తమనే ఎందుకు అండుకుంటున్నారంటూ కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ గుండాలు, పోలీసులు కలిసి కేసీఆర్ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అక్కడ పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుకు కదలనీయకుండా అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి కేటీఆర్ను బోయిన్పల్లి, హరీశ్రావును జవహర్నగర్ ఠాణాకు తరలించారు.
