హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక ఏరియాలో జరిగిన పనులను పూర్తి పథకానికి ఆపాదిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్డీపీ ద్వారా హైదరాబాద్ నగరంలో సుమారు రూ.985 కోట్లతో పలు వరద నియంత్రణ చర్యలు చేపట్టిందని వివరించారు. వీటిలో అత్యధిక పనులు ఒకటి రెండు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. రూ.450 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి సెప్టెంబర్ 30 నాటికి వర్కింగ్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ రూ.103 కోట్లు చెల్లించిందని, మరో రూ.150 కోట్ల బిల్లులు చెల్లింపు దశలో ఉన్నాయని తెలిపారు. మరో రూ.200 కోట్ల పనులు తుది దశలో ఉన్నాయని తెలిపారు.
మొత్తంగా రూ.450 కోట్ల విలువైన ఎస్ఎన్డీపీ పనులను కిషన్రెడ్డి దాచి ఉంచారని, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీకి ఎలాంటి నిధుల కొరత లేదని, బిల్లుల చెల్లింపు వేగంగా కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో అత్యంత సంక్లిష్టంగా ఉండే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఎన్డీపీ నిర్మాణాలు, కాలువల బలోపేతం వల్ల వరద ముప్పు తగ్గిన విషయం తెలిసిందేనని అన్నారు. ముఖ్యంగా బండ్లగూడ, నాగోల్, హయాత్నగర్, సింగరేణి కాలనీ, రామంతపూర్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల, మదీనగూడ, నిజాంపేట్, బంజారా కాలనీ, సరస్వతీ నగర్ మన్సూరాబాద్, వనస్థలిపురంలోని క్రిస్టియన్ కాలనీ, కోదండరామ్నగర్, పీ అండ్ టీ కాలనీ, తపోవన్ కాలనీ, స్వర్ణాంధ్ర కాలనీ యాప్రాల్, హబీబ్ నగర్, ఇక్రిశాట్ కాలనీ, హఫీజ్ బాబా నగర్, మురి నాల వంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాల్లో ప్రతి ఏడాది ఎదురయ్యే వరద ఇబ్బందులు ఈసారి చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల వలన నియంత్రించిన విషయం అకడి ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అంబర్పేట్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై కూడా ఆయనకి అవగాహన లేకపోవడం, పైగా జరిగిన పనులను జరగనట్లు ట్విట్టర్ ద్వారా పేరొనడం ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించడమేని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.