హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన టీఎస్ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఆప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్) పాలసీ విజయవంతంగా పనిచేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా గత ఎనిమిదేండ్లలో 19వేల కేసులను పరిష్కరించామని చెప్పారు. రాష్ర్టానికి ఇప్పటివరకు 35 బిలియన్ యూఎస్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 2.71లక్షల కోట్ల) పెట్టుబడులు తీసుకువచ్చామని, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని వెల్లడించారు.
“యాన్ అప్డేట్ టు ఇండియన్ ఎకానమి స్ట్రాటజీ టు 2035’ పేరుతో హైదరాబాద్లో సోమవారం ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని, దేశంలో మరే నగరంలోనూ లేని పెట్టుబడుల అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని చెప్పారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని, గత ఐదేండ్లుగా మెర్సర్స్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ వస్తున్నదని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక యూఎస్ స్టూడెంట్ వీసాలు కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని, యూకేతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అందుకే బెంగళూరుతోపాటు హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం..
భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్ నగరం బెటర్ ఆప్షన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘పెట్టుబడిదారులతో మాట్లాడే ప్రతీ సందర్భంలో నేను వారికి ఒక్కటే చెబుతాను. భారత్ వైవిధ్యమైన దేశం. ఇలాంటి దేశంలోకి ఏ రాష్ట్రం నుంచి ప్రవేశిస్తున్నామనేది చాలా కీలకం. ఆ దిశగా ఆలోచించాలనే నేను వారికి సూచిస్తాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ ముందున్నదని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మోస్ట్ ఫ్యూచర్డ్ స్టేట్గా తెలంగాణను గుర్తించడం సంతోషకరమన్నారు.
దేశంలోనే అత్యుత్తుమ ఇండస్ట్రియల్ పాలసీ..
తెలంగాణ ప్రభుత్వం 2014లో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకువచ్చిందని, చట్టబద్ధంగా సెల్ఫ్ సర్టిఫికేషన్తో పరిశ్రమలు నెలకొల్పుకునే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయని, ఇందులో వ్యక్తుల ప్రమేయం ఉండదని చెప్పారు. సులభతర విధానాలే పెట్టుబడిదారులను ఆకట్టుకుంటాయని తెలిపారు. హెచ్ఎస్ఐఎల్ (హిందుస్థాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) సందీప్ సుమానీకి తెలంగాణ రాక ముందు ఒక్కఫ్యాక్టరీ ఉండేదని, ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలో 8 ఫ్యాక్టరీలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడుల్లో 24శాతం రిపీటెడ్ పెట్టుబడులే కావడం, తెలంగాణపై పెట్టుబడుదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన చెప్పారు.
పెట్టుబడికి 14 ట్రస్ట్ ఏరియాలు
రాష్ట్రంలో పెట్టుబడికి 14 ట్రస్ట్ ఏరియాలు ఉన్నాయని, ఇందులో అత్యంత కీలకమైంది లైఫ్ సైన్సెస్ సెక్టార్ అని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచానికి కావలసిన వ్యాక్సిన్లలో 33శాతం ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతున్నదని అన్నారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్బీ, నాల్సర్, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెనల్ కాలేజీలతో తెలంగాణలో మానవవనరుల లభ్యతకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను 19వేల ఎకరాల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ఇదే సమయంలో కొత్త అవకాశాలపైనా దృష్టి సారించి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంటి కీలక రంగాలకు ఇండస్ట్రియల్ పార్క్లను కేటాయించామన్నారు. తెలంగాణలో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టడంతోపాటు రాష్ట్రంలోని ఔత్సాహికులు ఆస్ట్రేలియాలోనూ పెట్టుబడులు పెట్టే స్నేహపూర్వక వాతావరణం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఆస్ట్రేలియన్ కౌన్సుల్ జనరల్ ఇన్ చెన్నై కిర్లేవ్, ప్రతినిధులు, తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాపై ఇండియా డామినేషన్ కొనసాగాలి
ఆస్ట్రేలియాపై భారత ఆధిపత్యం కొనసాగాలని మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆస్ట్రేలియా కాన్సులేట్ నిర్వహించిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, ఆస్ట్రేలియాలకు పెట్టుబడి సంబంధాలకంటే.. క్రికెట్ బంధం ఎప్పటినుంచో ఉంది. మా హైదరాబాద్కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ సిడ్నీ, మెల్బోర్న్ సహా ఆస్ట్రేలియా టీమ్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. కొన్నేండ్లుగా ఇండియా క్రికెట్ జట్టు బాగా రాణిస్తున్నది. ఆస్ట్రేలియాపై మా డామినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా” అంటూ చమత్కరించారు.