హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ పన్నాగం బట్టబయలవుతున్నది. టీఆర్ఎస్ను దెబ్బకొట్టి, రాజకీయ ప్రయోజనం పొందేందుకు లక్షల మంది రైతుల జీవితాలను ఆగంచేసేందుకు పన్నిన మహా కుట్ర బయటపడిం ది. భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టి, బీడు భూము ల్లో సిరులు పండేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర బీజేపీ నేతలు నీచాతి నీచమైన పనులకు తెగబడ్డారు. వ్యవసాయరంగాన్ని దెబ్బతీస్తే తప్ప తెలంగాణలో టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేమని తెలిసి ఏడాదిన్నర కిందటే పన్నాగం మొదలు పెట్టారు. అందులో భాగంగానే వరి పంట విషయంలో రైతులను నిండా ముంచే పనికి పూనుకొన్నారు.
పన్నాగం-1: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో యాసంగిలో కచ్చితంగా బాయిల్డ్ రైస్ ఇవ్వాల్సిందే. రైతుల దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే మెడమీద కత్తి పెట్టయినా సరే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఒప్పందం చేసుకోవాలని కేంద్రం ప్లాన్ వేసి అమలు చేసింది. ఈ పన్నాగాన్ని పసిగట్టిన సీఎం కేసీఆర్ మీడియా సమావే శం నిర్వహించి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పిందని.. కాబట్టి యాసంగిలో వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు.
పన్నాగం-2: సీఎం ప్రకటనకు పూర్తి భిన్నంగా రైతులు వరి పంట వేయాలని, ప్రతి గింజా కొనిపించే బాధ్యత తీసుకొంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ‘నేను కేంద్ర మంత్రిగా హామీ ఇస్తు న్నా. యాసంగిలో ఎంత ధాన్యం వచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తది’ అని హామీ ఇచ్చారు. ఈ మాటలను నమ్మిన కొందరు రైతులు పంట వేశారు.
పన్నాగం-3: రైతులు డిసెంబర్ చివర్లో పంట వేస్తే ఫిబ్రవరి వరకు బీజేపీ నేతలు సైలెంట్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల క్షేమాన్ని కోరి వరి పంట వేసినవారు నష్టపోకుండా కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా విశ్వ ప్రయత్నాలు చేసింది. పంట చేతికొచ్చే దశలో బీజేపీ డ్రామాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ వీధుల్లో నాటకాలు మొదలుపెట్టారు. దీంతో కేంద్రం నేరుగా వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. వాటిని ముడి బియ్యంగా మార్చుకొంటారో.. బాయిల్ చేసుకొంటారో.. వడ్లుగానే నిల్వ చేసుకొంటారో మీ ఇష్టమని తెగేసి చెప్పింది. ఈ ఎత్తుగడ ఊహించక బీజేపీ గతుక్కుమన్నది.
పన్నాగం-4: ఏ రైతైనా ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్లముందే కల్లాల్లో నిలిచిపోతే కోపానికి వస్తాడు. దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టాలని, రైతులను ఆదుకోవాలని మొసలి కన్నీరు కారుస్తున్నారు. బండి సంజయ్ రైతులంతా రోడ్లమీదికి రావాలంటూ రెచ్చగొట్టేలా లేఖలు రాస్తున్నారు. టీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్, కేంద్రంపై జంగ్ సైరన్ మోగించారు. పంట కల్లాల్లోకి వచ్చేలోగా కేంద్రం మెడలు వంచాలని ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తున్నారు.
పన్నాగం-1: వరి పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వంతోనే రైతులకు చెప్పించాలి.
పన్నాగం-2: ఎట్ల కొనరో చూద్దాం.. మీరు పంట వేయండి.. మేం ప్రతి గింజ కొంటాం అని రైతులను రెచ్చగొట్టాలి. పంట వేయించాలి.
పన్నాగం-3: రెండు నెలలు నిశ్శబ్దంగా ఉండాలి. పంట చేతికొచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ ధర్నాలు చేయాలి.
పన్నాగం-4: రైతులను రెచ్చగొట్టాలి. వాళ్లు రోడ్లమీదికి వచ్చేలా ఎగేయాలి. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. రాజకీయంగా లబ్ధి పొందాలి.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ర్టానిది సహాయక పాత్ర మాత్రమే. కేంద్ర ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి, మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తుంది. క్వింటా వడ్లకు 67 కిలోల బియ్యం ఇయ్యాలన్నది కేంద్రం నిబంధన. అయితే యాసంగిలో పండే వడ్లను ముడి బియ్యం చేస్తే క్వింటాకు సుమారు 50 కిలోలు మాత్రమే బియ్యం వస్తాయని అందరికీ తెలుసు. ఇలా తక్కువయ్యే 17 కిలోల బియ్యం నష్టాన్ని ఎవరు భరించాలి? ఈ విషయాన్ని బండి సంజయ్, కిషన్రెడ్డి ప్రస్తావించడం లేదు. ‘జరిగే నష్టాన్ని కేంద్రం భరిస్తుంది’ అని వారు ఎందుకు ప్రకటించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసినట్టు ‘నేరుగా కేంద్రమే వడ్లు కొంటుంది, మిల్లింగ్ చేయించుకుంటుంది’ అని హామీ ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని, బియ్యంగా మార్చి, ఎఫ్సీఐకి ఇచ్చినందుకు కేంద్రం డబ్బు ఇస్తున్న మాట వాస్తవం. కానీ, వడ్లు కొనుగోలు చేయగానే రైతులకు డబ్బు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నది. కేంద్రం మాత్రం బియ్యం ఎఫ్సీఐకి చేరిన తర్వాత డబ్బు చెల్లిస్తున్నది. ఇలా ప్రతి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వంపై వడ్డీల రూపంలో సుమారు రూ.2 వేల కోట్ల వరకు భారం పడుతున్నది. ఏటా రూ.4 వేల కోట్లు భరిస్తున్నది. దీనిని బీజేపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదని నిపుణులు అంటున్నారు.