ఓ ఇద్దరు దంపతులది ఆసక్తికరమైన స్టోరీ. ఎనిమిదేండ్ల వివాహ జీవితంలో వివాదాలే అధికమవడంతో.. వారి అన్యోన్య ఓ ఇద్దరు దంపతులది ఆసక్తికరమైన స్టోరీ. ఎనిమిదేండ్ల వివాహ జీవితంలో వివాదాలే.. వారి అన్యోన్య బంధానికి దారులు మూసుకుపోయిన పరిస్థితి. రోజురోజుకు మనస్పర్థలు పెరిగిపోతుండటంతో.. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ విడాకుల నిర్ణయాన్ని ఎంపీటీసీ ఎన్నికలు వెనక్కి నెట్టేశాయి. ఎమ్మెల్యే చొరవతో ఆ దంపతులిద్దరూ ఒక్కటై.. మళ్లీ కొత్తగా తమ వైవాహిక జీవితంతో పాటు రాజకీయ జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అంతే కాదు..తమను మళ్లీ ఏకం చేసిన గులాబీ పార్టీ రుణం తీర్చుకునేందుకు.. ఇటీవలే తమకు పుట్టిన బిడ్డకు కేటీఆర్ అని కేసీఆర్ చేత నామకరణం చేయించి రుణం తీర్చుకున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన కలిగేటి లక్ష్మణ్, కవితకు ఎనిమిదేండ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉండాల్సిన ఆ దంపతుల మధ్య మనస్పర్థలు.. గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలి వానగా మారి.. వివాహ బంధానికే స్వస్తి పలికే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ గొడవలు, మనస్పర్థలతో కలిసి ఉండలేమని భావించిన ఆ దంపతులిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే విడాకులు వద్దు వివాహ బంధమే ముఖ్యమనే పరిస్థితి ఏర్పడింది.
ఒకరికొకరు అర్థం చేసుకుంటూ.. అన్యోన్యంగా ఉంటున్న దంపతుల సంసారంలోనూ ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయి. ఆ మాదిరిగానే ఈ దంపతుల విడాకుల నిర్ణయం.. తిరిగి వివాహ బంధానికి దారి తీసింది. ఈ దంపతులు తిరిగి ఒక్కటవ్వడానికి ఎంపీటీసీ ఎన్నికలే ప్రధాన పాత్ర పోషించాయి.
లక్ష్మణ్, కలిగేటి కవిత ఇక విడాకులు తీసుకుందామనే సమయంలోనే రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి ( రెండేళ్ల క్రితం ). ఆ ఎన్నికల్లో రామడుగు మండలం ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్ తన తల్లికి టికెట్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను కోరారు. కానీ ఎమ్మెల్యే ఒక షరతు విధించారు. అదేంటంటే.. విడిపోయిన భార్యతో కలిసి ఉంటేనే టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే షరతు పెట్టాడు. ఆ షరతు లక్ష్మణ్కు ఇబ్బందిగా మారినప్పటికీ.. రాజకీయ మక్కువతో దానికి తలొగ్గాల్సి వచ్చింది.
ఎంపీటీసీ టికెట్ ఆశించిన లక్ష్మణ్.. ఎమ్మెల్యే ద్వారా భార్య కవితతో సంప్రదింపులు జరిపారు. మొత్తానికి విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఎమ్మెల్యే కౌన్సెలింగ్ ఇచ్చి వారిద్దర్నీ కలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి కాకుండా భార్య కవితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలో కవితను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆమెను రామడుగు మండల ఎంపీపీగా కూడా చేశారు. లక్ష్మణ్ తాను అనుకున్నది సాధించడంతో.. భార్యపై మరింత ప్రేమ పెరిగి.. అన్యోన్యంగా జీవిస్తున్నారు.
లక్ష్మణ్, కవిత దంపతులకు ఇటీవలే పండంటి మగబిడ్డ జన్మించాడు. తమను కలిపింది పార్టీనే. తమ జీవితంలో మళ్లీ వెలుగులు పూయించిన గులాబీ పార్టీకి ఎలా రుణం తీర్చుకోవాలా? అని ఆలోచించారు ఆ దంపతులు. తమ జీవితానికి ఓ రూపునిచ్చిన పార్టీకి విధేయులుగా ఉండాలన్న సంకల్పంతో.. ఆ బిడ్డకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కేటీఆర్ అని నామకరణం చేసి పార్టీ రుణం తీర్చుకోవాలనుకున్నారు. అది కూడా కేసీఆర్ చేతుల మీదుగా.. ఆయన నోటితో నామకరణం చేయించాలనుకున్నారు.
కేసీఆర్ చేత నామకరణం చేయించాలనుకున్న ఆ దంపతుల కల ఎట్టకేలకు తీరింది. గత రెండు నెలలుగా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న లక్ష్మణ్, కవితకు శుక్రవారం ఆ అదృష్టం వరించింది. ఆ దంపతుల కోరికను ఎమ్మెల్యే రవిశంకర్ కరీంనగర్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కరీంనగర్ కలెక్టరేట్కు పిలిపించుకుని ఆ పిల్లోడికి కేటీఆర్ అని నామకరణం చేశారు. దీంతో లక్ష్మణ్, కవిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.