భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ (కేఎస్ఎం) ఇంజినీరింగ్ కాలేజీకి మహర్దశ రానున్నది. సమస్యల్లో కూరుకుపోయిన ఈ కాలేజీని పూర్తిస్థాయి యూనివర్సిటీగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి సూచించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. జిల్లాకు వరాలు ప్రకటించారు. కొత్తగూడెం పట్టణానికి రూ.40 కోట్లు, పాల్వంచకు రూ.40 కోట్లు, మణుగూరుకు రూ.25 కోట్లు, ఇల్లెందుకు రూ.25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని.. తద్వారా 4 మున్సిపాలిటీల అభివృద్ధికి బాటలు వేస్తామని సీఎం ప్రకటించారు.
మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారితో కలిసి కొత్తగూడెంలో నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానిక సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. వానకాలంలో కొత్తగూడెం, పాల్వంచలో మొర్రేడు వాగు వరదల నివారణకు చర్యలు చేపడతామని సీఎం హామీఇచ్చారు.
ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. గోదావరిపై 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని, పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగు నీరు అందుతుందని స్పష్టంచేశారు. ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలోని మొత్తం 481 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ప్రకటించారు. దీంతో సభకు హాజరైన సర్పంచ్లు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై క్లారిటీ
జర్నలిస్టుల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు భద్రాద్రి జిల్లా జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. సింగరేణి ప్రాంతంలో ఖాళీ స్థలాలను గుర్తించి, సంస్థ సీఎండీ శ్రీధర్తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ నుంచి హెలికాఫ్టర్లో 3.30 గంటలకు కొత్తగూడెంలోని సమీకృత కలెక్టరేట్కు చేరుకొన్నారు. మంత్రులు అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కలెక్టరేట్ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభలో భద్రాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపిస్తున్నప్పుడు జనం కరతాళ ధ్వనులు మిన్నంటాయి.