హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారుతున్నది. ఇతర సమస్యలన్నింటినీ పక్కనబెట్టి గెజిట్ అమలు ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నది. ముందస్తుగా సంప్రదించకుండానే ఏకపక్షంగా సమావేశ తేదీలను ఖరారు చేస్తున్నది. ఆ సమావేశాల్లో రాష్ర్టాలు చెప్పిన అభిప్రాయాలను నమోదు చేయకుండా తనకు తోచిన రీతిన వ్యవహరిస్తున్నది.
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి మొదటి విడతగా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా మొత్తం 18 చోట్ల కేఆర్ఎంబీ ఏర్పాటుచేసిన టెలీమెట్రీలు మూన్నాళ్ల ముచ్చటగా వెక్కిరిస్తున్నాయి. టెలీమెట్రీల ఏర్పాటు, నిర్వహణపై సాంకేతిక నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను అమలుచేయడం లేదు. రెండో దశలో 9 చోట్ల టెలీమెట్రీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. తెలంగాణ డిమాండ్ చేసినప్పుడల్లా హడావుడి చేయడమే తప్ప, సీరియస్గా దృష్టి సారించడం లేదు.
రివర్ బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తరువాత కేఆర్ఎంబీ తీరు మరింత శృతి మించిపోయిందనే విమర్శలున్నాయి.ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొంటున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. గెజిట్ అమలు ఒక్కటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టాల అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లేవనెత్తున్న అంశాలను అసలే పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా బోర్డు తన తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.