హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం గురువారం జరుగనున్నది. వర్చువల్ విధానంలో ఉదయం కమిటీ సభ్యులు భేటీకానున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కేటాయింపులపై చర్చ జరుగనున్నది. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్ఎంబీ ఫిబ్రవరిలో సూచించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు బోర్డు లేఖ రాసింది. 809 అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34 టీఎంసీల నీరు ఉందని, కనిష్ఠ వినియోగ మట్టాన్ని పరిగణలోకి తీసుకుంటే నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డు పేర్కొంది. కానీ, మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు కావాలని తెలంగాణ, ఆరు టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేశాయని కేఆర్ఎంబీ తెలిపింది.