హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కొద్దిరోజులుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలుపుతూ బీసీ సంక్షేమ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శనివారం హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫోన్ నంబర్ను ఎవరో పోస్ట్ చేశారని, దీంతో కొందరు ఆ నంబర్కు ఫోన్చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ‘హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్కు ఎందుకు మద్దతు ఇచ్చావు, ఈటల ఓటమిని ఎందుకు కోరావు’ అంటూ తనను ఆగంతకులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి వెయ్యికి పైగా ఇలాంటి కాల్స్ వచ్చాయని తెలిపారు. కొన్ని శక్తులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇటీవల తాను అభినందించడం వల్లే బెదిరింపులకు దిగుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నలభై ఏండ్లుగా బీసీల కోసం పనిచేస్తున్నానని, దీనివెనుక ఎవరున్నారో కనుక్కోవాలని కోరారు. దీనిపై హోంమంత్రి, డీజీపీ స్పందిస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నవారితోపాటు ఫేస్బుక్లో నంబరు పెట్టిన వారి ఆచూకి తెలుసుకుంటామని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.