హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ (Kondurg) మండల వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఈవోతోపాటు క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి చెప్పారు. ఏఈవో శ్రీశైలం కొందుర్గ్ మండలంలోని కొన్ని గ్రామాలకు ఇన్చార్జ్గా ఉన్నారని, రైతులు చనిపోయినట్లు ధ్రువపత్రాలు పెట్టి నిధులు మళ్లించుకున్నట్లు గుర్తించామన్నారు. అమాయకులను అక్ష్యంగా చేసుకుని ఫేక్ డాక్యుమెట్లు తయారు చేస్తున్నారని తెలిపారు. చనిపోయిన వారి పేరుతో రెండోసారి డబ్బులు తీసుకుంటారని పేర్కొన్నారు. గత నాలుగేండ్లుగా 20 మంది రైతుల పేరుతో రూ.2 కోట్లు కాజేశారని వెల్లడించారు. ఫోర్జరీ చేస్తున్నారని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కొందుర్గు మండల వ్యవసాయ శాఖ పరిధిలోనూ రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు తెలిసింది. రైతుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటికి బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రైతు బీమా సొమ్మునూ కాజేసినట్టు తెలుస్తున్నది. ఒకే ఖాతాకు రైతుబంధు, రైతుబీమా నిధులు వెల్లడంతో అనుమానం వచ్చిన సంబంధిత శాఖ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.