సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది. ఇక్కడి చేనేత కళాకారులు తయారుచేసిన తేలియా రుమాలుతోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబిబోన్ దుప్పటి, పలు వస్ర్తాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఈ ఏడాది పుట్టపాకకు చెందిన సామల వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. మూడు నెలలపాటు శ్రమించి తొమ్మిది రకాల డిజైన్లు, రెండు వందల పాయలతో నేసిన సింగిల్ ఇక్కత్ సిల్క్ స్పెషల్ డిజైన్ వస్త్రానికి ఈ అవార్డు వరించింది. చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఈ అవార్డు అందుకోనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రావడం పట్ల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.