హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : కేవలం 50 నుంచి 55 రోజుల్లోనే మొదటి కోతకొచ్చే నూతన బొబ్బెర రకాన్ని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ సబ్ కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే సురేంద్ర మోహన్ నేతృత్వంలో జరిగిన స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ఈ రకాన్ని ఆమోదించింది. ఈ మేరకు ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి వివరాలు వెల్లడించారు.
కూరబొబ్బెర 85 రోజుల్లోనే ఎకరానికి సుమారు ఏడు నుంచి 8 టన్నుల పచ్చికూర బొబ్బెర కాయలను దిగుబడి ఇస్తుందని వివరించారు. కాయల్లో 22 శాతం ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ పుషలంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన మొట్టమొదటి కూరగాయ రకం ఇదే అని పేర్కొన్నారు. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో, డాక్టర్ నిఖిల్, డాక్టర్ అనిత కుమారి శాస్త్రవేత్తల బృందం ఈ రకాన్ని తయారు చేసినట్టు వివరించారు.