Komuravelli Jatara | చేర్యాల, ఫిబ్రవరి 4 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 3వ ఆదివారం సందర్భంగా క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 50వేల మందిగాపైగా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, సనత్నగర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు కుటుంబ సమేతంగా మల్లన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
‘మల్లన్న’ భక్తులకు ఇక్కట్లు
ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల కారణంగా భక్తులు ఈసారి చాలా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి కొమురవెల్లికి ప్రైవేటు వాహనాల్లో రాగా, వాహనాలను క్షేత్రానికి చాలాదూరంంలోనే పోలీసులు నిలిపివేయడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తమ సామగ్రి నెత్తిన పెట్టుకుని ఇబ్బందులు పడుతూ ఆలయానికి చేరుకున్నారు. గదులు దొరకకపోవడంతో పరిసరాల్లో గుడారాలు వేసుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజామునే ఆలయ క్యూలైన్లకు వచ్చిన భక్తులకు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.
స్వామి వారి క్షేత్రంలోని ఆలయానికి అనుకుని ఉండే వీఐపీ గెస్ట్హౌస్ నంబర్వన్ నుంచి చాలామంది పైరవీలతో ప్రవేశించడంతో సామాన్య భక్తులు మల్లన్న దర్శనం కోసం గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. క్షేత్రంలో దాతలు నిర్మించిన గదులు నిండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రైవేటులో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించి జేబులు ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. అయినా చాలామందికి రూమ్లు దొరక్క పోవడంతో డబ్బులు చెల్లించి టెంట్లు వేసుకున్నారు. వ్యవసాయ బావుల వద్ద డబ్బులు చెల్లించి స్నానాలు చేశారు. కల్యాణకట్ట వద్ద క్షురకులు రూ.50 నుంచి రూ.100 చెల్లిస్తేనే తలనీలాలు తీశారు. కాంగ్రెస్ సర్కారులో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇబ్బందిపడ్డ అన్నదాత
బ్రహ్మోత్సవాల సమయంలో 7 ఆదివారాలపాటు ఏటా 4 వేల మందికి అన్నదానం చేస్తున్న మల్లన్న భక్తుడు శంకర్యాదవ్ ఆలయవర్గాలు, పోలీసుల చర్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈసారి ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల కారణంగా స్వామి వారి క్షేత్రానికి దూరంగా వాహనాలు నిలిపివేయడంతో అక్కడి నుంచి వంట సామగ్రి, పనులు చేసే కార్మికులు వాటిని నెత్తిన పెట్టుకొని రాలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో దాత శంకర్యాదవ్ తమ వాహనాలకు అనుమతి ఇవ్వాలని పోలీసులు, ఆలయవర్గాల దృష్టికి తీసుకుపోయిన వారు పట్టించుకోలేదు.