హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతున్నది. పార్టీని విమర్శించే అవకాశాన్ని బయటివారికి ఇవ్వకుండా ఆ పార్టీవారే చీల్చిచెండాడేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెట్టి వెంకట్రెడ్డి మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం కాంగ్రెస్ శాసనసభా పక్షం కార్యాలయ ఆవరణలో పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పుకునే కాంగ్రెస్కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ ఘోర పరాజయాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 72-78 సీట్లు వస్తాయని గంపెడాశతో అప్పుడే కొందరు నాయకులు సీఎం, మంత్రి పదవులను పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
బద్వేల్ ఉపఎన్నికలో నయం..
అధికారంలోకి వస్తుందనుకునే తెలంగాణ కంటే ఏమిలేదనుకునే ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పరిస్థితి కొంత నయంగా ఉన్నదని కోమటిరెడ్డి అన్నారు. ‘బద్వేల్ ఉపఎన్నికలో జీరో వస్తుందనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వస్తుందనుకునే తెలంగాణలో 3 వేల ఓట్లు వచ్చాయి’ అని అన్నారు. తెలంగాణలో పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలా? అని ఆలోచిస్తున్నామని చెప్పారు. గతంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని దయ్యం అన్నవారే ఇప్పుడు దేవత అంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు. పెద్దపెద్ద లీడర్లమని చెప్పుకునే నాయకులు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అప్పుడే పదవులు పంచుకుంటున్నారని విమర్శించారు. ‘నేను జిల్లా లీడర్ను మాత్రమే.. వాళ్లేమో పెద్ద లీడర్లు’ అని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.