నీలగిరి, మార్చి 6: పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ను దుర్భాషలాడటంతోపాటు చంపుతారని బెదిరించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు తండు సైదులుగౌడ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా ఎస్పీ అపూర్వరావుకు వెంకట్రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తండు సైదులుగౌడ్ మాట్లాడుతూ.. ఆదివారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, కోమటిరెడ్డిని అరెస్ట్టు చేయలేదని అందుకే జిల్లా ఎస్పీని కలిసి విన్నవించామని చెప్పారు. తక్షణమే వెంకటరెడ్డిని అరెస్టు చేసి చెరుకు సుధాకర్కు, అయన కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వనితనం వెంకట్రెడ్డిదన్నారు.
చెరుకు సుధాకర్కు పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం వెంకటరెడ్డికి గిట్టకనే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి చిల్లర మాటలను ప్రజలు గమనిస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చెరుకు సుహాస్ మాట్లాడుతూ తమ కుటుంబానికి వెంకటరెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, తెలంగాణ గౌడ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు మొగుళ్ల వినోద్కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేశ్గౌడ్, శ్రీ గౌడ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రామన్నగౌడ్, యూసుఫ్, జకీర్ పాల్గొన్నారు.